టీమ్ఇండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెల్మెట్పై జాతీయ జెండా లేకపోవడం వెనుక పెద్ద కథే ఉంది. దేశ సేవకు సదా సిద్ధంగా ఉండే మహీ హెల్మెట్పై త్రివర్ణ పతాకం తొలగించిన కారణం తెలిస్తే ఫ్యాన్ కావాల్సిందే!
క్రికెట్ను మతంగా.. సచిన్ టెండూల్కర్ను దైవంగా భావించే అభిమానులు ఉన్న మన దేశంలో.. స్టార్ ఆటగాళ్లకు కొదవే లేదు. తమ ఆటతీరు, వ్యవహార శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటారు. కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మూడేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు టాటా చెప్పి.. ఒక్క ఐపీఎల్లో తప్ప మిగిలిన ఏ స్థాయి క్రికెట్లోనూ కనిపించని మహీ భాయ్ గురించి ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహీ పేరు లేకుండా.. భారత చరిత్రను విశ్లేషించడం అసాధ్యమనే చెప్పుచ్చు. వికెట్ల వెనుక గంభీరంగా ఉండే.. ధోనీ మనసులో లక్ష ఆలోచనలు మెదులుతున్నా.. నిబ్బరంగా ఉంటూ ప్రపంచ క్రికెట్లో ‘మిస్టర్ కూల్’ అనే గుర్తింపు సాధించాడు. ‘పెదవి దాటని మాటకు నువ్వు రాజువి.. పెదవి దాటిన మాటకు నువ్వు బానిసవు’ అనే నానుడిని నిజం చేస్తూ.. మన మహేంద్రుడు ఏనాడు మాట తూలలేదు. ఇదే కాకుండా మరో చర్యతోనూ ధోనీ అభిమానుల గుండెలు పిండేసిన విషయం చాలా మందికి తెలిసే ఉండొచ్చు!
తన తొలి వన్డేలో రనౌట్తో ప్రస్థానాన్ని ప్రారంభించిన మాస్టర్ మైండ్ ధోనీ.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినంత కాలం వికెట్ కీపర్గా సేవలందించాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా రెప్పపాటులో వికెట్లను గిరాటేసే ధోనీ.. మెరుపు రనౌట్లకు కెరాఫ్ అడ్రస్ అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మహీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో అతడి హెల్మెట్పై జాతీయ జెండా లేకపోవడాన్ని మనలో చాలా మంది గుర్తించే ఉంటారు. జట్టులోని మిగిలిన పది మంది ఆటగాళ్ల హెల్మెట్పై ఉండే త్రివర్ణ పతాకం.. నరనరాన దేశభక్తి నింపుకున్న ధోనీ హెల్మెట్పై లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేయక మానదు. సుదీర్ఘ కాలం టీమ్ఇండియా సారథిగా కొనసాగిన ధోనీ హెల్మెట్పై జాతీయ జెండా లేకపోవడానికి బలమైన కారణమే ఉంది. అది తెలిస్తే.. అతడిపై మరింత అభిమానం పెరగక మానదు.
వికెట్ల వెనుక ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా నిలిచే మహీ.. స్పిన్నర్ల బౌలింగ్లో వికెట్లకు అతి సమీపంలో నిలువడం మనందరికీ గుర్తే. ఆ సమయంలో హెల్మెట్ ధరించని మహీ.. దాన్ని వికెట్ల వెనుక నిర్దేశిత ప్రాంతంలో నేల మీద ఉంచేవాడు. వన్డేలు, టీ20ల్లో ఇలా తరుచూ హెల్మెట్ను నేలపై ఉంచే అవసరం ఉండటంతో ధోనీ తన హెల్మెట్పై జాతీయ జెండాను తీసివేయించాడు. పదే పదే హెల్మెట్ కింద పెట్టాల్సిన అవసరం వస్తుండటంతో త్రివర్ణ పతాకాన్ని కింద పెట్టడం ఇష్టం లేని మహీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ హోదా దక్కించుకున్న మన మహేంద్రుడు 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో పుల్వామా బాధితులకు నివాళులర్పించేలా చేతి గ్లౌజ్లు ధరించిన విషయం తెలిసిందే.